ఆశాల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్
మేడ్చల్: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11న నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లపై ఉన్న ఏఎన్సీ టార్గెట్లను వెంటనే ఎత్తివేయాలని, ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.
ఆశా వర్కర్లను బీఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి వర్తించే సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సంబు ప్రభాకర్ కోరారు.

