బెజ్జంకి, ఆగస్టు 13 (ప్రజావాణి)
ప్రజాబాట–బస్తీబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. అలాగే విద్యుత్ లైన్లకు అవసరమైన మరమ్మతు పనులను చేపట్టారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు, రైతులకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ లైన్మెన్లు కష్టపడి, ప్రమాదకర పరిస్థితుల్లో సైతం విధులు నిర్వహిస్తున్నారని ఏఈ మహేష్ తెలిపారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లైన్లను సురక్షితంగా ఉంచడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ప్రజలకు విద్యుత్ సంబంధితంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, వినియోగదారులకు, రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు విద్యుత్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఏఈ మహేష్ తెలిపారు.

