కోహెడ, ఆగస్టు 12(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లాలో నేరాల నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో “సురక్ష నేత్ర” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీ సదానందం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ సదానందం, కోహెడ ఎస్సై అభిలాష్ గ్రామ ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని ఏసీపీ తెలిపారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని ఏసీపీ సదానందం తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
*రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి*
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణాలను నివారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్సై అభిలాష్, విలేజ్ విపిఓ మోహన్, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

