📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల తమ్ముళ్ల ‘వెలిగొండ’ ర్యాలీలో వర్గ పోరు: నాయకుల ముందే తలపడ్డ చెరుకూరి, కల్వకూరి వర్గాలు.....

పోరుమామిళ్ల తమ్ముళ్ల ‘వెలిగొండ’ ర్యాలీలో వర్గ పోరు: నాయకుల ముందే తలపడ్డ చెరుకూరి, కల్వకూరి వర్గాలు.. రచ్చ రచ్చ!

📰 Generate e-Paper Clip

అధికారం చేతికందక ముందే ఆధిపత్యం కోసం ఆరాటం! ఐక్యత చాటాల్సిన వేదికపై అంతర్గత కుమ్ములాటల బహిరంగ ప్రదర్శన!”

పోరుమామిళ్ల ఆగస్టు 31 ప్రజావాణి ఎన్నికల యుద్ధంలో శత్రువును చిత్తు చేయాల్సిన సైనికులు.సొంత గూట్లోనే కత్తులు నూరుకుంటున్నారు.బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు.వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాల వేదికగా ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి మాసునూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పట్టణంలో భారీ ప్రదర్శన ద్వారా పార్టీ బలాన్ని చాటాలని భావించిన నేతలకు.. సొంత తమ్ముళ్లే ఊహించని షాక్ ఇచ్చారు. అగ్రనాయకత్వం సమక్షంలోనే రెండు వర్గాలు నడిరోడ్డుపై వీధిపోరాటానికి దిగడం, ఒకరినొకరు నెట్టేసుకునే స్థాయికి వెళ్లడం స్థానికంగా పెను కలకలం రేపింది.
సహనం కోల్పోయిన నేతలు.. ఉద్రిక్తంగా మారిన ర్యాలీ ప్రాంగణం:
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పోరుమామిళ్ల డిగ్రీ కళాశాల నుంచి పట్టణంలోని జూనియర్ కళాశాల వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.వందలాది మంది కార్యకర్తలు, బైక్ లతో సందడి వాతావరణం నెలకొంది.సరిగ్గా ర్యాలీ ప్రారంభం కావాల్సిన తరుణంలో.పార్టీలోని ఇద్దరు కీలక నేతలైన చెరుకూరి రవికుమార్,ఎంపీటీసీ కల్వకూరి రమణల మధ్య అకస్మాత్తుగా వివాదం చెలరేగింది.పాత కక్షలు,స్థానిక ఆధిపత్య పోరు మనసులో పెట్టుకున్న ఇరు నేతలు ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాటామాటా పెంచుకున్నారు. నేతలే సంయమనం కోల్పోవడంతో.అక్కడ ఉన్న కార్యకర్తలు సైతం క్షణాల్లో రెండు వర్గాలుగా విడిపోయారు.పరస్పరం దూషణలు,ఘర్షణలతో ర్యాలీ ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక సాధారణ కార్యకర్తలు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అర్ధాంతరంగా వెనుదిరిగిన ఎంపీటీసీ రమణ వర్గం:
నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యనారాయణ రెడ్డి సమక్షంలోనే ఈ స్థాయి రచ్చ జరుగుతున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు.తీవ్ర అసంతృప్తికి లోనైన ఎంపీటీసీ కల్వకూరి రమణ.పార్టీలో తమకు కనీస గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తూ తన వర్గం కార్యకర్తలతో కలిసి ర్యాలీ నుంచి అర్ధాంతరంగా వెనుతిరిగారు.పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతను చాటాల్సిన వేడుక.ఇలా సగం మంది నిరసనతో వెనుతిరగడంతో వెలవెలబోయింది.
ఘటనపై స్పందించిన ముఖ్య నాయకులు:
ఈ ఘర్షణ తీవ్ర సంచలనంగా మారడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి మరియు ఇరు వర్గాల నేతలు దీనిపై ఘాటుగా స్పందించారు.*సూర్యనారాయణ రెడ్డి (నియోజకవర్గ ఇన్‌చార్జి):”పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సహించేది లేదు.వెలిగొండ ప్రాజెక్టు లాంటి చారిత్రాత్మక విజయోత్సవ శుభదినాన ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం.కార్యకర్తల మధ్య స్థానిక అపార్థాల వల్ల చిన్నపాటి వాగ్వాదం జరిగింది తప్ప ఇది గ్రూపు రాజకీయం కాదు.అయినప్పటికీ,అధిష్టానం సమక్షంలో గొడవకు దిగి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం.అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే.”
* చెరుకూరి రవికుమార్ (టీడీపీ యువనాయకుడు):
“కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము క్రమశిక్షణతో ఏర్పాట్లు చేస్తుంటే.కొంతమంది కావాలనే ప్రణాళికబద్ధంగా గొడవ సృష్టించి ర్యాలీని చెడగొట్టాలని చూశారు.మాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు, పార్టీ లైన్‌లోనే మేము నడుస్తున్నాం.ఉద్దేశపూర్వకంగా రచ్చ చేసిన వారిపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.”
* కల్వకూరి రమణ (టీడీపీ ఎంపీటీసీ):
“పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న మాకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానాలకు గురిచేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా,మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం వల్లే మా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మగౌరవం లేని చోట మేము ఉండలేకే ర్యాలీ నుంచి వెనుతిరిగాం.మా ఆవేదనను,నియోజకవర్గంలో జరుగుతున్నపరిణామాలను త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్తాం.”

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.. కుమ్ములాటలపై విస్మయం:
నియోజకవర్గంలో కూటమి బలాన్ని చాటాల్సిన సమయంలో.ఇలా బహిరంగంగా రోడ్డుపై మాటల యుద్ధం జరగటం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.”ఇంటి గుట్టు లంకకు చేటు” అన్నట్లుగా.పార్టీ అంతర్గత విభేదాలను వీధికెక్కించడంపై సీనియర్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో.ఇలా ఇన్‌చార్జి ముందే గ్రూపు రాజకీయాలు నడపడం క్యాడర్‌ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది.ఈ ఘాటు పరిణామాలు ఇప్పటికే జిల్లా,రాష్ట్ర స్థాయి కమిటీల దృష్టికి వెళ్లినట్లు సమాచారం.మరి ఈ వర్గ పోరుకు ఇన్‌చార్జి ఎలా బ్రేకులు వేస్తారో,అధిష్టానం ఎలాంటి చర్యలతో చక్కదిద్దుతుందో వేచి చూడాలీ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.