నంగునూరు, ఆగస్టు 23:
ముత్యాల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో సిద్ధిపేట నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని యువ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. సిద్ధిపేట నంగునూరు మండలం మగ్ధుంపూర్ నిర్వహించిన శ్రీ బీరప్ప బోనాల పండుగ, శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి వంగ రాజేశ్వర్ రెడ్డి ఆదివారం హాజరై అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు
బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి అమ్మవారిని కొలిచారు. ముత్యాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
*సంప్రదాయాలు ఐక్యతకు ప్రతీక*
ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాలను పరిరక్షించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బోనాలు, గ్రామ దేవతల ఉత్సవాలు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులు, కురుమ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, కురుమ సంఘం సభ్యులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. భక్తుల సందడితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

