ఘట్కేసర్, ఆగస్టు 21 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రేవంత్ అన్న టీం సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి చొరవ చూపారు. కాలనీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోందని, సీసీ రోడ్లు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని స్థానికులు గత వారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మురుగునీరు, బురద కారణంగా దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
కాలనీవాసుల సమస్యలపై వెంటనే స్పందించిన శ్రీకాంత్రెడ్డి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఆయన విజ్ఞప్తి మేరకు శుక్రవారం అధికారులు శ్రీకాంత్రెడ్డితో కలిసి కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.
కాలనీలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అధికారులు త్వరలోనే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. తమ సమస్యపై వెంటనే స్పందించి అధికారులను కదిలించిన సింగిరెడ్డి శ్రీకాంత్రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.


