ఘట్కేసర్, ఆగస్టు 26: పోచారం డివిజన్ పరిధిలోని కాచవాని సింగారం, ముత్వెల్లిగూడ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన ప్రధాన రహదారులను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీజేపీ ఘట్కేసర్ మండల అధ్యక్షుడు బస్వరాజు గౌడ్, స్థానిక నాయకుడు చిప్పలపల్లి దినేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బస్వరాజు గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారులపై నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ధర్నా విషయం తెలుసుకున్న ఘట్కేసర్ సర్కిల్ కమిషనర్ వాణి ఫోన్ ద్వారా బీజేపీ నాయకులతో మాట్లాడి, వారం రోజుల్లో రహదారి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నాను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పూలు భాస్కర్ గౌడ్, గోబిరి మన్యం, ఉపాధ్యక్షులు బాలరాజ్ గౌడ్, కృష్ణ యాదవ్, కోశాధికారి సంధ్యారాణి, జిల్లా రాజకా కో-కన్వీనర్ బండిరాల సాయిరాం, శక్తి కేంద్రం ఇన్చార్జ్లు కందుల అశోక్ ముదిరాజ్, కనకం నాగరాజ్, గాయారి రాజేష్, సీనియర్ నాయకులు కిన్నెర రత్నాకర్, ఆముద రాము, కొమ్మిశెట్టి శ్రావణ్, వంచ స్వప్న, బూత్ అధ్యక్షులు మేకల శంకర్ ముదిరాజ్, ఎర్ర యాదగిరి, నాయకులు మేడబోయిన రాజు, బోయిని నాగరాజ్, వీర మహేందర్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



