📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetహుస్నాబాద్‌లో ఘనంగా 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన సదస్సు..

హుస్నాబాద్‌లో ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు..

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్‌లో ఘనంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు.ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,* డ్రైవర్లకు దుస్తులు, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్లు , హెల్మెట్ పంపిణీ..

సిద్దిపేట్ హుస్నాబాద్, జూన్ 13, ప్రజావాణి

ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచి, ప్రమాదాల నివారణే ధ్యేయంగా చేపట్టిన *’అరైవ్ అలైవ్’* కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్స్‌లో భారీ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ (సీపీ) రష్మి పెరుమాళ్ , జిల్లా కలెక్టర్. హైమావతి,పాల్గొన్నారు.ప్రమాద రహిత సమాజం కోసమే ‘అరైవ్ అలైవ్’: సీపీ రష్మి పెరుమాళ్,ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సదస్సులో ప్రదర్శించిన రోడ్డు ప్రమాదాల వీడియోలను చూసైనా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని కోరారు. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ మీ ముందుకు వచ్చి ఈ అవగాహన కల్పిస్తోందని అన్నారు. సీపీ తన ప్రసంగంలో పలు కీలక సూచనలు చేశారు:ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అప్పుడే ఇద్దరికీ రక్షణ ఉంటుంది. చిన్న పిల్లలను బైక్ ముందు కూర్చోబెట్టుకోవడం చాలా ప్రమాదకరం, అతివేగం వద్దు.. పనులకు వెళ్లేటప్పుడు కొంచెం ముందుగానే బయల్దేరాలనీ సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే బలవంతంగా డ్రైవ్ చేయకుండా, ఒక 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.డ్రంక్ అండ్ డ్రైవ్ (మద్యం సేవించి వాహనం నడపడం) చేయరాదు. పట్టుబడితే రూ.10,000 వరకు జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నదే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సుకు వచ్చిన వారు ఇక్కడి విషయాలను తమ ఇళ్లలోని వారికి కూడా వివరించాలని కోరారు.సిద్దిపేటను ‘ట్రాఫిక్ చలాన్ రహిత జిల్లా’గా మార్చాలి: కలెక్టర్ కె. హైమావతి,జిల్లా కలెక్టర్ కె. హైమావతి  మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కడో లేదా ఎవరికో జరుగుతాయి, మనకు జరగవు అనే భ్రమలో ఉండవద్దని హెచ్చరించారు. జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరవడం సంతోషకరమని, మహిళలు ఇక్కడి సందేశాన్ని తమ ఇంట్లోని పురుషులకు, పిల్లలకు వివరించి వారిలో మార్పు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో కుటుంబంలో ఏ ఒక్కరిని కోల్పోయినా ఆ వెలితిని ఎవరూ తీర్చలేరని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలను పాటించి,సిద్దిపేట జిల్లాను ‘ట్రాఫిక్ చలాన్ రహిత జిల్లా’గా మార్చాలని, జిల్లావాసులంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.ప్రమాద బాధితులను కాపాడితే రూ.25,000 ‘రహావీర్’ అవార్డు: మంత్రి పొన్నం ప్రభాకర్,ముఖ్య అతిథి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాట్లాడుతూ..99వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీస్ మరియు రవాణా శాఖలు సంయుక్తంగా ప్రజల సంక్షేమం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోగా (గోల్డెన్ అవర్) బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం నుండి రహవీర్ అవార్డ్ అందిస్తామన్నారు. యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అవి ఆరోగ్యానికి తీవ్ర హానికరం అని హెచ్చరించారు. పిల్లలు ప్రయోజకులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సదస్సులో మంత్రి  చేయించిన మూడు ప్రమాణాలు : 1. హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లకూడదు అని. 2. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయము.3.మద్యం సేవించి వాహనం నడపము.అనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరితో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రవాణా రంగ డ్రైవర్లకు యూనిఫారాలు, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను,హెల్మెట్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్ ఏసిపి సదానందం, సిఐ శ్రీను, ఎస్ఐ లక్ష్మ రెడ్డి, పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.