ఘట్కేసర్, ఏప్రిల్ 17 (ప్రజావాణి):
2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్పల నర్సింగ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వృద్ధాప్య పెన్షన్ను ₹2000 నుండి ₹4000కు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ను ₹6000కు పెంచుతామని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ధరల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
తక్షణమే పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకుని అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజలు రాబోయే రోజుల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ పెంపు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




