బెజ్జంకి,జూలై 19 (ప్రజావాణి)
సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డా. సీహెచ్ ధనరాజ్ అన్నారు.శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఓపీ నిర్వహణ, రికార్డులు, ప్రయోగశాల, ఫార్మసీ, ఔషధ నిల్వలు, వ్యాధి నిరోధక టీకాల లభ్యత, శీతలీకరణ వ్యవస్థలను పరిశీలించారు. ఓపీకి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీని మరింత పెంచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. క్షయవ్యాధి రోగులను నిరంతరం పర్యవేక్షించాలని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని, ముఖ్యంగా గర్భిణులు,బాలింతలు, చిన్నారులకు అందాల్సిన టీకాలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. మాధురి, డా. కృష్ణతేజ, హెచ్ఓ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ సులోచన, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




