.
రైతురక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్ మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్.
ఎల్కతుర్తి, (ప్రజావాణి)న్యూస్:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వహణలో రైతుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ రాజకీయ జోక్యాన్ని పెంచడం అత్యంత బాధాకరమని తెలంగాణ రైతురక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్ మరియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ అన్నారు.
రైతుల ఆర్థికాభివృద్ధి, పంట రుణాలు,ఎరువులు, విత్తనాల పంపిణీ,ధాన్యం కొనుగోలు వంటి కీలక సేవలను అందించే సహకార సంఘాలు రైతుల సొంత సంస్థలు.అలాంటి సంస్థలను రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలుగా మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
సహకార సంఘాల పాలకవర్గాలను రైతులే స్వేచ్ఛగా ఎన్నిక చేసుకునే అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం,నామినేటెడ్ పదవులతో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయ నిరుద్యోగులకు పదవులు కట్టబెట్టే ధోరణిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
సహకార సంఘాలు రాజకీయాల కోసం కాకుండా రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలని,వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడాలని కోరారు.రైతుల అభిప్రాయాలను గౌరవిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి రైతుల చేతుల్లోనే సహకార సంఘాల పాలన ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల హక్కులకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ రైతురక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఉద్యమాలు చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని హింగే భాస్కర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు నాయకులు కొదరే మాధవరావు సుధాకర్ రావు శ్రీనివాస్ భాషపోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాలు రైతుల స్వయం ప్రతిపత్తి సంస్థలుగానే కొనసాగించాలి
RELATED ARTICLES



