లక్ష్మాపూర్ నుండి ఆరేపల్లి వరకు రోడ్డు నిర్మించాలని మండల అభివృద్ధి అధికారికి సర్పంచుల వినతి
రామాయంపేట, జూలై 28: లక్ష్మాపూర్ నుండి ఆరేపల్లి తండా (దంతేపల్లి) వరకు ఉన్న రహదారి తీవ్ర గుంతలతో ప్రమాదకరంగా మారిందని క్యాట్రియాల్, దంతేపల్లి సర్పంచులు స్రవంతి రాజేంద్రగుప్త, మస్కూరి బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్రామ పంచాయతీల మీదుగా కామారెడ్డికి వెళ్లే ఈ రోడ్డును పంచాయతీరాజ్ నుండి ఆర్ అండ్ బీ పరిధిలోకి మార్చాలని కోరుతూ ఎంపీడీవో షాజలోద్దీన్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.4.13 కోట్లు మంజూరై మూడేళ్లయినా పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. ఎంపీ సూచనల మేరకు ఆరు గ్రామాల సర్పంచులు తీర్మాన ప్రతులను అధికారులకు సమర్పించారు. మండల, జిల్లాస్థాయి తీర్మానాలు పూర్తి చేసి ప్రతిపాదనలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిధులు విడుదలయ్యేలా చొరవ చూపి, రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


