మే డే వేడుకల్లో సత్తా చాటిన ఫీల్డ్ అసిస్టెంట్
ఉత్తమ పురస్కారం అందుకున్న పొన్నం రాజు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 1 (ప్రజావాణి):
మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో విశేష సేవలందించిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో, ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్) పొన్నం రాజుకు ‘ఉత్తమ పురస్కారం’ లభించింది. జిల్లాలో ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించడంలోనూ, కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించడంలోనూ పొన్నం రాజు చూపిన చొరవకు గాను ఈ అవార్డు వరించింది. ఈ పురస్కారాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్, లేబర్ కమిషనర్, గుల్లకోట గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా అధికారుల బృందం పొన్నం రాజును అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైన అంకితభావంతో ఉపాధి హామీ పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, పలువురు ప్రజాప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

