📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriభార్యపై కత్తెరతో దాడి చేసిన భర్త.. ఘట్కేసర్‌లో కలకలం

భార్యపై కత్తెరతో దాడి చేసిన భర్త.. ఘట్కేసర్‌లో కలకలం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూలై 24: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యపై భర్త కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు మహమ్మద్ ఫహద్ సైఫుల్లా (24) తల్లిదండ్రులు సుమారు 26 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా దాంపత్య కలహాల కారణంగా వారు వేర్వేరుగా నివసిస్తున్నారు. ఇటీవల కుటుంబ వివాదాల నేపథ్యంలో ఫహద్ తల్లి రిజ్వానా బేగం ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించగా, ఇరు పక్షాలను కుటుంబ సలహా కేంద్రానికి కౌన్సెలింగ్ కోసం పంపించారు.

ఈ నెల 24న జరిగిన కుటుంబ చర్చ సందర్భంగా రిజ్వానా బేగం భర్త మహమ్మద్ రహీం ఆగ్రహంతో కత్తెరతో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఛాతీ, చేతి, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కాగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుమారుడు ఫహద్ సైఫుల్లాకు కూడా చేతికి గాయమైంది.

గాయపడిన రిజ్వానా బేగంను తొలుత ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular