•భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం
సంఘానికి స్థలం కేటాయిస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, జూన్ 19(ప్రజావాణి:పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) అన్నారు. శుక్రవారం తెల్లాపూర్లో తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంఘం కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆ అభివృద్ధికి భవన నిర్మాణ కార్మికులే వెన్నెముకలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవసరమైన స్థలాన్ని త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి కార్మికుడు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్ భద్రతను కల్పించుకోవాలని సూచించారు.
కార్మికుల ఐక్యత, సంఘటిత శక్తి ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొంటూ, సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, శ్రీశైలం, దయాకర్, పాల్ రెడ్డి, నాగరాజు, సాగర్, హర్ష, ఇంద్రారెడ్డి, సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





