📄 ePaper
Tuesday, July 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ మున్సిపాలిటీలో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీలు: కల్వర్టు లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

బద్వేల్ మున్సిపాలిటీలో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీలు: కల్వర్టు లేక స్థానికుల తీవ్ర ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

బద్వేల్ జూలై 13 ప్రజావాణి మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కల్వర్టులు లేక స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దెబ్బతిన్న డ్రైనేజీలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప పలకలు (ఐరన్ షీట్లు) ఇప్పుడు ప్రాణసంకటంగా మారాయి.ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పాదచారులు,వాహనదారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాత్కాలిక పలకలతో ప్రమాదకర పరిస్థితి
మురుగు నీటి కాలువలపై శాశ్వత కల్వర్టులు నిర్మించాల్సిన అధికారులు,కేవలం తాత్కాలికంగా ఇనుప పలకలను వేసి చేతులు దులుపుకున్నారు.ప్రస్తుతం ఈ పలకలు దెబ్బతిని,డ్రైనేజీ గుంతలు బయటపడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.రాత్రి వేళల్లో మరియు వర్షం పడినప్పుడు ఈ గుంతలు సరిగ్గా కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు నడిచేటప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రూ.130 కోట్ల అభివృద్ధి నిధులు ఎక్కడ?
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.130 కోట్ల నిధులు ఎక్కడ ఖర్చయ్యాయంటూ స్థానికులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్నప్పటికీ,పట్టణంలో కనీస అవసరమైన డ్రైనేజీ కల్వర్టులను ఎందుకు నిర్మించలేదని ప్రజలు మండిపడుతున్నారు.ప్రజల సొమ్ముతో జరిగిన పనుల వివరాలను మున్సిపల్ అధికారులు వెంటనే బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిధులపై సందేహాలు
గతంలో వచ్చిన నిధులతో పాటు,ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.120 కోట్ల నిధుల వినియోగంపై కూడా ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇంత భారీగా నిధులు అందుతున్నా, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల విజ్ఞప్తి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి,ఈ ప్రమాదకరమైన తాత్కాలిక ఇనుప పలకల స్థానంలో వెంటనే శాశ్వత కల్వర్టులను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి,ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బద్వేల్ మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు,వాహనదారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular