ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి…
డీఎల్పీవో సతీష్
జల సంరక్షణే భవిష్యత్కు భరోసా: పోతుగల్ సర్పంచ్ పామెన నర్సింలు
షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో జల సంరక్షణపై జలసిరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎల్పిఓ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎల్పీవో సతీష్ మాట్లాడుతూ… ప్రతి కుటుంబం తమ ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడంలో ఇంకుడు గుంతలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.గ్రామ సర్పంచ్ పామెన నర్సింలు మాట్లాడుతూ… గ్రామంలో జల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి వంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని,పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో షాబాద్ ఎంపీఓ నాసరయ్య, ఉప సర్పంచ్ నేరట్ల సావిత్రి, వార్డు సభ్యులు రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మల్లేష్, ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




