•ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్ఓల సేవలు అమూల్యం: మాద్రి పృథ్వీరాజ్
*ఎస్ఐఆర్–2026లో విధులు నిర్వహిస్తున్న ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బందికి ఎండీఆర్ ఫౌండేషన్ ద్వారా బ్యాగులు, గొడుగుల పంపిణీ
పటాన్చెరు, జూలై 22 (ప్రజావాణి):ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో బీఎల్ఓలుగా సేవలందిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ అన్నారు.
ఎస్ఐఆర్–2026 కార్యక్రమంలో ప్రజలకు సేవలందిస్తున్న బీఎల్ఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బందిని అభినందిస్తూ ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగులు, గొడుగులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం వంటి బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్న బీఎల్ఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది సేవలు అభినందనీయమని కొనియాడారు.
ప్రతి అర్హత కలిగిన పౌరుడు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమ సేవలను గుర్తించి సన్మానించిన మాద్రి పృథ్వీరాజ్కు బీఎల్ఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎండీఆర్ ఫౌండేషన్ సభ్యులు, బీఎల్ఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.




