ఘట్కేసర్, జూన్ 30: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ పరిధిలోని కాచవాని సింగారంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిఎంసి సభ్యులు తాల్క రాములు మాట్లాడుతూ, పౌర హక్కుల రక్షణ చట్టం (పీసీఆర్–1955) మరియు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (పీఓఏ–1989) అమలు తీరును వివరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టాలు కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. చట్టాల నిబంధనలు, బాధితులకు కల్పించే రక్షణలు, ప్రభుత్వ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నాగులపల్లి శ్రీనివాస్, వీఆర్ఏ శ్రీకాంత్, కిన్నెర రవీందర్, చెంచు నవీన్, కిన్నెర ప్రవీణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని చట్టాల పరిరక్షణను సద్వినియోగం చేసుకోవాలని వక్తలు సూచించారు.




