ఘట్కేసర్, మే 18 (ప్రజావాణి): దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని ఘట్కేసర్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందని ఆయన అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు అధికమై అన్ని వస్తువుల ధరలపై ప్రభావం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఈ పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వినోద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కష్టాలను గుర్తించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని, లేకపోతే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


