*జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే*
*పిర్యాదుదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, సైబర్ మోసాలు, ఆర్థిక లావాదేవీలు, పోలీస్ సంబంధిత ఫిర్యాదులు తదితర అంశాలపై ఎస్పీ ని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం దాదాపు 38 మంది పిర్యాదుదారులు ఎస్పీ ని కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే విచారణ చేపట్టి, చట్టపరంగా త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకంతో ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ గ్రీవెన్స్ డే ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.



