కలెక్టర్ గారు
కొంచెం కనికరించారా
పందిళ్ళపల్లి వ్యవహారాన్ని తేల్చని అధికారులు..?
కలెక్టర్ గారు…!
కొంచెం కనికరించారా..!!
నవంబర్ 24 ప్రజావాణి దరఖాస్తుకు పరిష్కారం చూపరా..
*విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి తో పాటు చింతకాని ఎంపీఓపై చర్యలు తీసుకుంటారా…?
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ ప్లాట్ వ్యవహారంలో గత ఏడాది నవంబర్ 24వ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. దీనికి తోడు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక సమగ్ర ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించిన సంగతి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికారులకు తెలిసిందే. నాటి కలెక్టర్ డిపిఓ సుమోటోగా పరిగణించి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో ఇన్చార్జి డిపిఓ రాంబాబు క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలించి విచారణ చేసి అనంతరం ఫిబ్రవరి నెలలో ఖమ్మం జిల్లా పంచాయతీ కార్యాలయంలో విచారణ చేశారు. అనంతరం విధులు పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యవహారంపై రికార్డులను పరిశీలించి ధ్రువీకరించి మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబుకు అధికారికంగా షో కాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు పంచాయతీ కార్యదర్శి తప్పుడు వివరణ ఇచ్చినట్లు సంతృప్తి చెందని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు చింతకాని మండల పంచాయతీ అధికారిని పర్వీన్ కు ఐదు రోజుల గడువుతో నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేశారు. అయినప్పటికీ సదరు పంచాయతీ అధికారిని నెల రోజులు పైగా గడుస్తున్నప్పటికీ నివేదిక అందజేయలేదని జిల్లా పంచాయతీ కార్యాలయంలోని ఏవో రాజేశ్వర్ ధృవీకరించారు. ఈ వ్యవహారంపై సదరు ఏవో మాట్లాడుతూ కనుక్కొని పూర్తి వివరాలు వెల్లడిస్తాం ఒకసారి చింతకాని ఎం పి ఓ ను వివరణ కోరండి అంటూ మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధికి సూచించారు. ఈ విషయంపై ప్రతినిధి మాట్లాడుతూ సదరు ఎంపీ ఓ పలుమార్లు చరవాణిలో సంప్రదించినప్పటికీ స్పందించడం లేదని గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నదని వివరించారు ఈ సందర్భంగా సదరు ఏవో స్పందించి ఎంపిఓను నివేదిక కోసం సంప్రదిస్తామని పూర్తి వివరాలు వెల్లడిస్తామని బదులిచ్చారు. కాగా 2009 2010 సంవత్సరం లో పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ రికార్డులలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 2017 సంవత్సరం మొదలు ఇటీవల దాకా అనేక అక్రమాలు జరిగినట్లు రికార్డులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పొందుపరిచినట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పందిళ్ళపల్లి వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి పై మరియు నివేదిక అందజేయడంలో జాప్యం మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుత ఎంపీఓపై చర్యలు తీసుకోవాలని బాధితులు మండల ప్రజలు కోరుతున్నారు. కాగా అవినీతి అక్రమాలకు పాల్పడిన బండి నాగేంద్రబాబు పలు రికార్డులను నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి అమలు చేసినట్లు అదే రికార్డులను పరిశీలించకుండా 2017 సంవత్సరంలో పనిచేసిన కార్యదర్శి సదరు బినామీ మహిళకు ఆన్లైన్ చేసినట్లుప్రస్తుత పంచాయతీ కార్యదర్శి కూడా ఆ రికార్డులను స్పష్టంగా పరిశీలించకుండా ఎలా వచ్చిందో రికార్డులలో లేదు కానీ నో డ్యూ సర్టిఫికెట్ మాత్రం ఇచ్చాను అంటూ గ్రామపంచాయతీ పన్నులు మాత్రమే వసూలు చేసినట్లు క్లీన్ చిట్ ఇచ్చి గత సంవత్సరం నవంబర్ లో జరిగిన రిజిస్ట్రేషన్ కు సహకరించినట్లు ఆరోపణలు విమర్శలు వెలువెత్తుతున్నాయి.


