పోస్టర్లు ఆవిష్కరించిన జైపూర్ ఎంపీడీవో, ఎంపీఓ
జైపూర్, జూలై 24,ప్రజావాణి:
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని జైపూర్ ఎంపీడీవో జి. సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపురావు కోరారు. శుక్రవారం జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ జలసిరి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ (పంటకుంటలు), ఊట కుంటల ఏర్పాటు , బోరు బావుల రీఛార్జ్ ద్వారా భూగర్భ జలమట్టాన్ని పెంచవచ్చని తెలిపారు. వర్షపు నీరు వృధా కాకుండా నేరుగా భూమిలోకి చేరేలా చూడాలన్నారు. ఈ పోస్టర్లను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో అంటించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో బాలయ్య, సర్పంచ్ కూన భాస్కర్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది ఇంద్రావతి, తిరుపతి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు




