డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి – ఎస్ఐ పిలుపు
నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 12 :
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ, సమాజం నుంచి డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం కారణంగా యువత, విద్యార్థులు అనారోగ్య సమస్యలకు గురవడంతో పాటు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమని, మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసులు నిత్యం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారని, గంజాయి రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి “డ్రగ్స్ వద్దు… జీవితమే ముద్దు” అనే నినాదాలతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు.




