టేకులపల్లిలో రైతు సేవా కేంద్రం ప్రారంభం..
సీసీ రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
టేకులపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ నియోజకవర్గంలోని టేకులపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో (ఎస్ఐఆర్) పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రైతులకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేందుకు రైతు సేవా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, సీసీ రహదారుల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..



