*దొర్లబంగ్లలో మరో ప్రాణాన్ని బలిగొన్న గుడుంబా..!*
-అధికారుల నిర్లక్ష్యమే అమాయకుల ప్రాణాలకు శాపమా..?
మన ప్రజావాణి
మందమర్రి, జూలై 3
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొర్లబంగ్ల ప్రాంతంలో గుడుంబా మళ్లీ ఒక ప్రాణాన్ని బలిగొన్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గుడుంబా సేవించిన అనంతరం ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, గత కొన్నేళ్లుగా దొర్లబంగ్ల ప్రాంతంలో గుడుంబా సేవించడం వల్ల ఇప్పటికే దాదాపు పది మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ గుడుంబా తయారీ, నిల్వ, విక్రయాలపై సంబంధిత శాఖలు సమర్థవంతమైన చర్యలు చేపట్టలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.గుడుంబా తయారీ కేంద్రాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం తప్ప శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. దీంతో గుడుంబా వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతూ మరిన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రాణాంతకమని తెలిసినా కొందరు వ్యసనానికి బానిసలవుతుండగా, అక్రమంగా గుడుంబా తయారు చేసి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి విషాదాలు పునరావృతమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గుడుంబా నిర్మూలనకు శాశ్వత చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఇకపై అయినా ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించి గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని దొర్లబంగ్ల ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.





