ఘట్కేసర్, జూలై 21: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజిగూడ ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీకి చెందిన ఓర్సు లింగం అనే కూలీ కార్మికుడు మంగళవారం పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య సరిత (31)తో 2009లో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపాడు.
ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఇంట్లో మంచానికి సంబంధించిన విషయంపై కుటుంబ సభ్యులతో సరితకు వాగ్వాదం జరిగిందని, అనంతరం ఆమె రెండో కుమార్తె అమూల్య (12), కుమారుడు రిషిత్ (9)లను వెంట తీసుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
భార్య సెల్ఫోన్కు పలుమార్లు కాల్ చేసినప్పటికీ మొదట కొన్ని సార్లు రింగ్ వెళ్లి, అనంతరం స్విచ్ ఆఫ్ అయిందని తెలిపాడు. బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా వారి ఆచూకీ లభించలేదని పేర్కొన్నాడు.
గతంలో కూడా కుటుంబ కలహాల కారణంగా రెండుసార్లు ఇంటి నుంచి వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని, ఈసారి కూడా తిరిగి వస్తుందని భావించి వేచి చూశానని ఫిర్యాదుదారు వెల్లడించాడు. అయితే మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు.
అదృశ్యమైన సరిత సుమారు ఐదు అడుగుల ఎత్తు, తెల్లటి వర్ణం కలిగి ఉండగా, అమూల్య ఏడో తరగతి, రిషిత్ నాలుగో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోచారం ఐటీసీ పోలీసులు మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




