బెజ్జంకి,మే 9 (ప్రజావాణి )
కరీంనగర్ బంద్కు మద్దతు తెలిపిన తమను ఇంట్లోనే నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదని మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయంపై జరిగిన దాడి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కారుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిర్వహించిన కరీంనగర్ బంద్లో పాల్గొనకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
ప్రజల కోసం పోరాడే నాయకులను పొద్దుపొద్దున్నే నిద్రలేపి ఇంటికే పోలీసులను పంపించడం ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మార్పా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ – బీజేపీ కలిసి రాజకీయ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రజల తరఫున పోరాడే తమ స్వరం మరింత బలంగా వినిపిస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.

