పోచారం, జూన్ 11: విధులకు వెళ్లిన ఓ యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కీసర మండల పరిధిలోని రాంపల్లి 2బీహెచ్కే హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిట్యాల లక్ష్మి కుమార్తె రేవతి (20) ప్రైవేట్ ఉద్యోగిని. గతంలో కొత్తపేటలోని ఓ సంస్థలో పనిచేసిన ఆమె ఇటీవల సికింద్రాబాద్లోని మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహిస్తోంది.
ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో విధులకు వెళ్లిన రేవతి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుమార్లు ఆమె మొబైల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు తెలిసింది. అనంతరం బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు మరియు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
అదృశ్యమైన సమయంలో రేవతి తెలుపు రంగు టాప్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉందని, ఆమె ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, తెల్లని వర్ణం కలిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.



