*ఆదివాసీల గౌరవం, జీవనాధారం 1/70 చట్టం*
.గొంది రాజేష్.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి):* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని షెడ్యూల్డ్ ఏరియాల్లో ఆదివాసీల భూములను బయటి వ్యక్తులకు బదిలీ చేయకుండా నిషేధించే 1/70 చట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగానే ఉంచాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేష్ అన్నారు.
గోవిందరావుపేట మండల కేంద్రంలో సంఘం జిల్లా ఫ్రాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. 1959 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ను 1970లో సవరించి తెచ్చిన ఈ చట్టం ఆదివాసీల భూముల అమ్మకం, గిఫ్ట్, లీజు, మార్గేజ్లను నిషేధిస్తుందని తెలిపారు.
ఈ చట్టం లేకపోతే ఆర్థికంగా బలహీనమైన ఆదివాసీలు భూమిహీనులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇది కేవలం భూమి రక్షణే కాదు, ఆదివాసీ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణకు కూడా రక్షణ అని అన్నారు.
ఆధునికీకరణ, అభివృద్ధి పేరుతో చట్టాన్ని సవరించాలన్నది అసంబద్ధమని, ఇది భూమాఫియా, కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతుల్లోకి ఆదివాసీ భూములు వెళ్లేందుకు దారితీస్తుందని హెచ్చరించారు.
చట్టం ఉన్నట్టుగా ఉంటేనే ఆదివాసీలు భద్రతా భావంతో జీవించగలరని, సవరణలు చేస్తే వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు. భూమి ఉన్నంతవరకే ఆదివాసీలు ఉంటారని కాబట్టి 1/70 చట్టాన్ని కాపాడుకోవడం జాతీయ బాధ్యత అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, రాష్ట్ర కమిటీ సభ్యులు జెజ్జరి దామోదర్, జిల్లా కమిటీ సభ్యులు పూనెం నగేష్, అలెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల గౌరవం జీవనాధారం 1/ 70 చట్టం గొంది రాజేష్
RELATED ARTICLES




