జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి జులై 20 (ప్రజావాణి):
దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆదివారం రోజునా మండలం లోని ఉండేడ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డీడీఎన్ ఉమ్మడి వెల్గటూర్ మండల అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ సర్పంచ్ ఆవుల మమత తిరుపతి, ఉపసర్పంచ్ పోతు రవి, దేవాలయ చైర్మన్ రాయమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్ గుంటి శ్రీనివాస్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు, ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. దేవాదాయ శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఆలయాల ప్రాంగణాల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.




