*అంగన్వాడీ భూమి ఆక్రమణపై ఎమ్మార్వో కు ఫిర్యాదు*
-ఆక్రమణ తొలగించాలని కాలనీవాసుల డిమాండ్
మందమర్రి, (మన ప్రజావాణి)జూన్ 18
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీ, డోర్లాబంగ్లా 4వ వార్డు కాలనీవాసులు ప్రభుత్వ భూమి ఆక్రమణ అంశంపై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు.కాలనీవాసుల కథనం ప్రకారం, కాలనీలోని అంగన్వాడీ కేంద్రం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే దారిని మూసివేస్తూ గేటు నిర్మించడం, రహదారి మధ్యలో షెడ్డు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.ఈ విషయంపై ప్రశ్నించిన స్థానికులను దుర్భాషలాడటంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని కాలనీవాసులు ఆరోపించారు. కాలనీలో గత 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వ భూమిపై జరిగినట్లు ఆరోపిస్తున్న ఆక్రమణలను పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మార్వోను కోరారు.
ఈ ఫిర్యాదులో కాలనీవాసులు గొర్రె రామచందర్, తిరుపతి వెంకటేశ్వర్లు, సంపత్ బచ్చలి, సురేందర్, ఆనందం, కనుకం లక్ష్మి, కుదిరిపాక రవీందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భూమి ఆక్రమణపై ఎమ్మార్వో కు ఫిర్యాదు
RELATED ARTICLES

