📰 Generate e-Paper Clip
మొదటిసారి పంచాయతీ పాలకవర్గం చేతిలోకి గుడి… మారింది ఏమిటి?
అసంపూర్తిగా గుడికి, గుడి గోడలకు రంగులు.
రంగులు పూయాల్సిన గుడికే రంగులేదే… కానీ కార్యక్రమాలు మాత్రం కలర్ఫుల్!
తిరుమలాయపాలెం, ప్రజావాణి:
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వేణుగోపాల స్వామి గుడి… ఇప్పుడు కొత్త పాలకవర్గం చేతుల్లోకి వచ్చినా పరిస్థితి మాత్రం పాతదే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గుడి గోడలు పాడైపోయి… పైకప్పు శిథిలావస్థలో ఉండగానే… కనీసం రంగురంగులతో అద్దాల్సిన గుడిని కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో వేయలేకపోవడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. “గుడికి రంగులు వేయలేని పాలకవర్గం… అభివృద్ధి రంగులు ఎలా పూస్తుంది?” అంటూ గ్రామస్తులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.మరోవైపు, గుడి రూపురేఖలు మారకపోయినా… పూజలు, కార్యక్రమాలు మాత్రం ఘనంగా నిర్వహించడం గమనార్హం. “గోడలకు రంగులేకపోయినా… కార్యక్రమాలకు మాత్రం రంగుల కొదవలేదు!” అంటూ స్థానికులు సెటైర్లు వేస్తున్నారు.
మొదటిసారి పంచాయతీ పాలకవర్గం చేతిలోకి గుడి బాధ్యతలు వచ్చినా… అభివృద్ధి పనుల్లో స్పష్టత కనిపించకపోవడం, గుడి శిథిలావస్థ కొనసాగుతుండటం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“మారింది పాలకవర్గమే గానీ… గుడి పరిస్థితి మాత్రం మారలేదే!” అన్న మాటలు గ్రామంలో వినిపిస్తున్నాయి.
ఇకనైనా గుడికి నిజమైన అభివృద్ధి రంగులు పూయిస్తారా… లేక పూజల రంగులతోనే సరిపెడతారా అన్నది వేచి చూడాలి.