ఇందుర్తి ఈద్గా, ఖబ్రస్థాన్లో మౌలిక వసతులు కల్పించాలి
మంత్రి పొన్నంకు మస్జీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ విజ్ఞప్తి
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):జీవన గమనాన్ని నేర్పే పవిత్ర మాసమే రంజాన్ అని మస్జీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఇందుర్తి ఈద్గాలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముఫ్తీ సాదుల్లా సందేశాన్ని వినిపిస్తూ ఈద్ నమాజ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ఇందుర్తి గ్రామంలోని ఈద్గా మరియు ఖబ్రస్థాన్లలో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కు విజ్ఞప్తి చేశారు. అలాగే ముస్లిం స్మశానవాటికకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను కలెక్టర్ ద్వారా త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.ముస్లింల ప్రధాన పండుగైన ఈద్కు రంజాన్ మాసంతో ప్రత్యేక సంబంధం ఉందని రఫీ పేర్కొన్నారు. ఇస్లాం మతానికి మార్గదర్శకమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలో అవతరించిందని, అందువల్ల రంజాన్కు విశిష్ట గౌరవం లభించిందన్నారు. ‘రోజా’ ఉపవాసం ద్వారా మానవుల్లో సహనం, దయ, కరుణ, త్యాగం, పరోపకారం వంటి సద్గుణాలు పెంపొందుతాయని వివరించారు.ఉపవాసం వల్ల పేదల ఆకలి బాధను అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చని, ఇది మానవీయ విలువలను మరింతగా పెంచుతుందని మహమ్మద్ రఫీ తెలిపారు. నెల రోజుల ఉపవాసాలను ముగించుకుని షవ్వాల్ మొదటి తేదీన ఈద్-ఉల్-ఫితర్ను ఆనందంగా జరుపుకుంటారని చెప్పారు.ఈ సందర్భంగా ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జర్నలిస్టు గాదే రఘునాథరెడ్డి ఇందుర్తి ఈద్గాను సందర్శించి ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మస్జీద్ కమిటీ సభ్యులు ఉస్మాన్ పాషా, ఎక్బాల్, సిరాజ్, అప్సర్, శంషీర్, ఉమ్మర్, నవాబ్, ఖాసీం, రాజ్ మహమ్మద్, నసిర్, జావిద్, బాబూమియా, చాన్ మియా, అబ్బాస్, మకబూల్ తదితరులు పాల్గొన్నారు.





