తిరుమలాయపాలెం, ప్రజావాణి:
తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలోని ఐలమ్మ సెంటర్లో సైడ్ కాలువల ఆక్రమణల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి మాత్రం కొందరినే లక్ష్యంగా చేసుకుని “సెలెక్టివ్ చర్యలు” కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రాంతంలో పూర్తిగా కాలువలను ఆక్రమించి పెద్ద స్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో చిన్నపాటి నిర్మాణాలు చేసిన వారిపై మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.
“పెద్దవారికి మినహాయింపులు… చిన్నవారికే శిక్షలేనా?” అంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్కు స్పష్టంగా కనిపించే ఈ అక్రమాలు ఎందుకు కనిపించడం లేదని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ అంశంపై గళమెత్తిన వారిపై పాలకవర్గం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారాయి.ఐలమ్మ సెంటర్లో నెలకొన్న ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఎవరి పట్లైనా ఒకే విధంగా న్యాయం జరిగేలా సర్పంచ్ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ సమస్య మరింత పెద్ద వివాదంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.




