అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం
మన ప్రజావాణి
చౌడేపల్లి ఫిబ్రవరి 28
అన్నమయ్య జిల్లాలోని చౌడేపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక రూరల్ సీఐ సాయి ప్రసాద్ , ఎస్సై చిన్నారెడ్డప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సైకిల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టి మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు చిన్ననాటి నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించుకోవాలని సూచించారు. అమ్మ, అక్క, చెల్లి రూపంలో మహిళలు కుటుంబానికి బలమైన అండగా నిలుస్తారని, వారి రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు.
మహిళలపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత, గౌరవం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను చాటిచెప్పారు. సైకిల్ రన్ ద్వారా సమాజానికి మంచి సందేశం అందించారు.




