మఠంపల్లిలో వసూళ్ల దందా ఆరోపణలు
పత్రిక పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు
మఠంపల్లి, ఫిబ్రవరి 21:
మఠంపల్లి మండలంలో పత్రిక పేరుతో కొంతమంది వ్యాపారుల వద్ద వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫర్టిలైజర్ షాపులు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ స్థానిక వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
శనివారం ఒక పత్రికలో ప్రచురితమైన ఫర్టిలైజర్ షాప్కు సంబంధించిన వార్తపై వివాదం నెలకొంది. సంబంధిత ఫర్టిలైజర్ యజమాని ప్రకారం, “నిషేధిత బయో మందులు అమ్ముతున్నారని ఆరోపిస్తూ ముందుగా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే వార్త ప్రచురిస్తామని బెదిరించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ దుకాణంపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపకుండా వార్త ప్రచురించారని, దీనివల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని యజమాని తెలిపారు.
ఈ విషయంపై స్థానిక వ్యాపార వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆరోపణలపై సంబంధిత రిపోర్టర్ నుంచి అధికారిక స్పందన ఇంకా లభించలేదు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



