📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మనోహరాబాద్ జేపీహెచ్‌ఎస్‌లో ఘనంగా న్యూట్రిషన్ మేళా

మనోహరాబాద్ జేపీహెచ్‌ఎస్‌లో ఘనంగా న్యూట్రిషన్ మేళా

📰 Generate e-Paper Clip

మనోహరాబాద్ జేపీహెచ్‌ఎస్‌లో ఘనంగా న్యూట్రిషన్ మేళా

మనోహరాబాద్, సెప్టెంబర్ 19: మనోహరాబాద్ మండల కేంద్రంలోని జేపీహెచ్‌ఎస్‌లో శుక్రవారం పేరెంట్–టీచర్ మీటింగ్ సందర్భంగా న్యూట్రిషన్ మేళాను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు న్యూట్రిషన్ మేళాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో తయారు చేసుకునే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో పాటు వివిధ రకాల పోషక విలువలు కలిగిన వంటకాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. ఒక్కో ఆహార పదార్థంలో ఉండే పోషక విలువలను ఇతర విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు తదితర పోషకాలు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండి, ఇంట్లో తయారు చేసే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం పి. వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రిషన్ మేళా ద్వారా విద్యార్థులు కేవలం పోషకాహారం గురించి తెలుసుకోవడమే కాకుండా, స్వయంగా ఆహార పదార్థాలను తయారు చేసి వాటి పోషక విలువలను వివరించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రీతి రెడ్డి, గ్రామ సర్పంచ్ అనుషా భాస్కర్ యాదవ్, ఉపసర్పంచ్ వెంకట రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార ప్రదర్శనలను పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే ఐసీడీఎస్ సూపర్‌వైజర్, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలిస్తూ వాటిలోని పోషక విలువల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి ప్రదర్శనలను అభినందించారు. న్యూట్రిషన్ మేళాతో పాటు నిర్వహించిన పేరెంట్–టీచర్ మీటింగ్‌లో విద్యార్థుల విద్యా ప్రగతిపై కూడా చర్చించారు. విద్యార్థుల చదువు, హాజరు, విద్యా సామర్థ్యం, తరగతి గదిలో వారి పురోగతి తదితర అంశాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులలో చదువుతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి విద్య, ఆరోగ్యం రెండూ సమానంగా అవసరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అవగాహన మరింత పెరుగుతుందని తెలిపారు.
కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల ఉత్సాహం, వారి సృజనాత్మకతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతుల్య ఆహారం ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించడమే న్యూట్రిషన్ మేళా ప్రధాన లక్ష్యమని పాఠశాల హెచ్‌ఎం పి. వెంకటస్వామి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.