ప్రధాన రహదారిపై వ్యర్థ జలాలు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
గోదావరిఖని మార్కండేయ కాలనీలో రోడ్డుపైకి వ్యర్థ జలాలు వదులుతున్నా చర్యలు శూన్యం
గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి వెంట ఓ ప్రముఖ వైద్యుడు నిర్మించిన భవనం నుంచి వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన రహదారిపై మురుగునీరు ప్రవహిస్తున్నా రామగుండం మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా?
మార్కండేయ కాలనీ ప్రధాన రహదారిపై వ్యర్థ జలాల సమస్యను తక్షణమే పరిష్కరించి, రోడ్డుపైకి నీటిని వదులుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

