*శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం*
*పంక్చర్ అయిన వాహనాన్ని బాగుచేస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన టాటా ట్రక్*
*ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు*
*ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పరారీ*
మేడ్చల్: శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనాన్ని రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ట్రక్ ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి
చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం టాటా ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
శామీర్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్ధరాత్రి సుమారు 12:35 గంటల సమయంలో ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. ఫిర్యాదుదారు మహ్మద్ హుస్సేన్ సోదరుడు ఇస్మాయిల్ హుస్సేన్ (26)తో పాటు కూలీలు ఇబ్రహీం, రింకు, అశోక్, భీమ్ షాలు TS 09 UD 3611 నంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో స్క్రాప్ లోడ్తో చెగుంట నుంచి ఓఆర్ఆర్ మీదుగా కీసర వైపు బయలుదేరారు. వాహనం ఓఆర్ఆర్
ఎగ్జిట్ నంబర్-06 వద్ద నుంచి బయటకు వచ్చి షామీర్పేట ఓఆర్ఆర్ పై వెళ్తుండగా, లియోనియా ఫుట్ఓవర్ బ్రిడ్జిని దాటిన అనంతరం సుమారు 300 మీటర్ల దూరంలో వాహనం కుడివైపు వెనుక టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని ఓఆర్ఆర్ ఎమర్జెన్సీ లేన్లో నిలిపివేశారు. టైర్ను మార్చేందుకు రింకు, ఇబ్రహీం జాకీ రాడ్ సహాయంతో పంక్చర్ అయిన టైర్ను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇస్మాయిల్ హుస్సేన్ టార్చ్ లైట్ పట్టుకుని వాహనం కింద పని చేస్తున్నారు. అదే సమయంలో అశోక్, భీమ్ షా వాహనానికి సపోర్టుగా పెట్టేందుకు రాళ్లు తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో TS 15 UD 8932 నంబర్ గల టాటా ట్రక్ వెనుక నుంచి వేగంగా వచ్చి ఎమర్జెన్సీ లేన్లో నిలిపి ఉన్న అశోక్ లేలాండ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రింకు, ఇబ్రహీం, ఇస్మాయిల్ హుస్సేన్ తీవ్ర రక్తస్రావంతో గాయపడ్డారు. రింకు, ఇస్మాయిల్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫిర్యాదుదారు మహ్మద్ హుస్సేన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ రింకు, ఇస్మాయిల్ హుస్సేన్ తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు.
ప్రమాదం అనంతరం టాటా ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న భీమ్ షా తెలిపిన వివరాల ప్రకారం, డ్రైవర్ తన పేరు నాగరాజు, మియాపూర్ నివాసిగా చెప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై శామీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల వేగం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

