విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
వేములవాడ ,సెప్టెంబర్ 17,
విశ్వకర్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విశ్వబ్రాహ్మణులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి, విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ప్రార్థించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాచీన కాలంలోనే నగరాలు, భవనాల నిర్మాణంలో విశ్వకర్మ తన అపూర్వమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే అద్భుతమైన నిర్మాణాలను చేపట్టిన మహానుభావుడిగా విశ్వకర్మను ప్రజలు ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు.తమ పూర్వీకుల నుంచి ఇళ్ల నిర్మాణం, చెక్క పనులు, లోహ పనులు, స్వర్ణకార వృత్తి తదితర కులవృత్తుల్లో విశ్వబ్రాహ్మణులు ప్రత్యేక నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆధునిక కాలంలో ఆర్కిటెక్ట్లు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ, సంప్రదాయ వృత్తుల్లో వారి నైపుణ్యానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమాలు, అన్నదానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వకర్మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులకు మంచి జరగాలని,కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతి, అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. జిల్లా నాయకులు సనుగుల సత్యం, విశ్వబ్రాహ్మణ కులస్తులు పాల్గొన్నారు.

