ఘట్కేసర్, సెప్టెంబర్ 7 (ప్రజావాణి): గురువుల సేవలను స్మరించుకుంటూ అన్నోజిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ‘రేవంత్ అన్న టీం’ సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రధానోపాధ్యాయులు తిరుమలరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తూ, పాఠశాల అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అన్నోజిగూడ పాఠశాల సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు పి. భాషయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు.
ముఖ్య అతిథి సింగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. భావితరాలను తీర్చిదిద్దే గురువుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అన్నోజిగూడ పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రతాప్రెడ్డి, రాందాస్, అనురాధ, భవాని, అమరేశ్వర్, బాసయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు విజయ్కుమార్, రాజు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


