పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం కీసర తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు కీసర గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు చినింగని బాల్రాజ్, ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా వివాహ సమయంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందన్నారు. ప్రస్తుతం ఈ పథకాలను నిలిపివేస్తున్నారనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పథకాల అమలులో జాప్యం లేకుండా, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని నాయకులు కోరారు.
ధర్నాలో కీసర గ్రామ మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు శీలం శ్రీనివాస్, రాగుల రమేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గోరంటి ప్రవీణ్, ఉపాధ్యక్షులు సుమన్ బన్నీ, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్, యువత అధ్యక్షుడు రెడ్డబోయిన మహేష్, హరి గౌడ్, రాజలింగం, ఎర్ర సాయిలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందేలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

