ఘట్కేసర్, ఆగస్టు 14 (ప్రజా వాణి): పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రెవెన్యూ సర్వే నంబర్ 93లోని భూమిపై తమకే పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని దివంగత ఒస్కే వెంకట్ నర్సింహారెడ్డి వారసులు స్పష్టం చేశారు. తమ హక్కులకు 1979 నాటి రిజిస్టర్డ్ విక్రయ పత్రాలే బలమైన ఆధారమని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
వారసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ పూర్వీకుడైన ఒస్కే వెంకట్ నర్సింహారెడ్డికి అన్నోజిగూడలోని సర్వే నంబర్ 93లో మొత్తం 14 ఎకరాల 27 గుంటల వ్యవసాయ భూమి ఉండేదన్నారు. అందులో నుంచి 1979లో 7 ఎకరాల 13 గుంటల భూమిని మాత్రమే నల్లవెల్లి అంజయ్యకు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని తెలిపారు. మిగిలిన భూమిపై తమ కుటుంబానికే యాజమాన్య హక్కులు కొనసాగాయని పేర్కొన్నారు.
1979 డిసెంబర్ 20న హైదరాబాద్ ఈస్ట్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో బుక్-1, వాల్యూం-45లో డాక్యుమెంట్ నంబర్ 12812/1979గా నమోదైన విక్రయ పత్రంలో భూమి సరిహద్దులు స్పష్టంగా పేర్కొన్నట్లు వారసులు తెలిపారు. ఉత్తరాన బాలగోని రాజయ్య భూమి, దక్షిణాన వినోద్ పటేల్ భూమి, తూర్పున విక్రేతకు చెందిన మిగిలిన భూమి, పడమరన పీడబ్ల్యూడీ రోడ్డు ఉన్నట్లు పత్రాల్లో నమోదు అయిందన్నారు.
“మేము విక్రయించిన భూమికి తూర్పు సరిహద్దుగా ‘విక్రేత మిగిలిన భూమి’ అని రిజిస్టర్డ్ పత్రాల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో తూర్పు వైపున మిగిలిన భూమిపై మా కుటుంబ హక్కులు ఉన్న విషయం అధికారిక పత్రాల ద్వారానే స్పష్టమవుతోంది” అని వారు వివరించారు.
తమ తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన మిగిలిన భూమిని అనంతరం బాలగౌని బాలరాజ్ గౌడ్కు చట్టబద్ధంగా విక్రయించినట్లు తెలిపారు. ఈ క్రయవిక్రయానికి సంబంధించిన అన్ని రిజిస్టర్డ్ పత్రాలు, ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
“భూమి విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. మా వద్ద ఉన్న అధికారిక పత్రాల ఆధారంగానే లావాదేవీలు జరిగాయి. కొందరు కావాలని చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. చట్టబద్ధమైన ఆధారాలు పూర్తిగా మా వద్ద ఉన్నాయి” అని ఒస్కే వెంకట్ నర్సింహారెడ్డి వారసులు స్పష్టం చేశారు.

