వృద్ధులపై వివక్ష?
కొత్త పెన్షన్ల మంజూరులో వృద్ధులకు దక్కని చోటుకళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా కనిపించని ఫలితంవృద్ధులకు ఆసరా ఏది?
మంథని నియోజక వర్గ ప్రతినిధి, ఆగస్టు 12, ప్రజావాణి:
మంథని నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల మంజూరుపై వృద్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వయోభారం, ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు కొత్త పెన్షన్ల మంజూరులో తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తులు చేసుకుని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా ఫలితం కనిపించడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసరాగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు కొందరు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం నుంచి పెన్షన్ అందకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని వృద్ధులు వాపోతున్నారు. ‘‘కన్నవారు కనికరించరు.. ప్రభుత్వం కరుణించదు’’ అన్నట్లుగా తమ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియలో అర్హులైన వృద్ధులకు ప్రాధాన్యత కల్పించి, వారి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వృద్ధులు వేడుకుంటున్నారు. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలిచేలా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

