*ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరి*
*నల్లబ్యాడ్జీతో నిరసన తెలిపిన టీఎస్ యూటీఎఫ్ భద్రాచలం మండలం నాయకులు*
*డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక*
-
భద్రాచలం/మన ప్రజావాణి (07 ఆగస్టు 26): ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని టీఎస్ యూటీఎఫ్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏల విడుదల, పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు తదితర ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని మండిపడ్డారు.
యూపీఎస్సీ పిలుపు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు భద్రాచలం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహికంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ గర్ల్స్ హైస్కూల్, ఎంపీయూపీఎస్ జగదీష్ కాలనీ, ఎస్ఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల, ఎంపీపీఎస్ తాతపూడి సెంటర్, ఎంపీపీఎస్ కుర్రాజులగుట్ట, ఆశ్రమ పాఠశాల గర్ల్స్ తదితర పాఠశాలల్లో ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆరు డీఏలు పెండింగ్లో ఉంచడం తీవ్ర అన్యాయమని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొత్త పీఆర్సీని ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. అలాగే ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని హెచ్చరించారు. డీఏలు విడుదల చేయాలి. పీఆర్సీ ప్రకటించాలి. సీపీఎస్ను రద్దు చేయాలి అంటూ, ఉపాధ్యాయులు నినదిస్తూ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఇకనైనా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయ్కుమార్, భద్రాచలం మండల అధ్యక్షుడు కొమరం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పి.ఎస్.వి. ప్రసాద్బాబు, ఉపాధ్యక్షులు కరుణ్కుమార్, పుష్పలత, కోశాధికారిణి ఆశాలత, ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్ సైదులు, మైనార్టీ కళాశాల కన్వీనర్ బి. బాలాజీ, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.




