ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
మొబైల్ ఛార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఒక వ్యక్తి అసువులు బాసిన ఘటన గురువారం రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… బుస్సాపురం గ్రామానికి చెందిన పాలెం రవి, 46 గురువారం రాత్రి సుమారు 10:30 గంటలకు నిద్రించే ముందు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగను గమనించకపోవడంతో కరెంటు షాక్ తగిలింది. దీంతో రవి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు.
కుప్పకూలిన రవిని గమనించిన భార్య, ఇరుగు పొరుగువారు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ములుగు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
పేద కుటుంబం… ప్రభుత్వం ఆదుకోవాలి
మృతుడు రవికి *భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెక్కాడితేనే డొక్కాడే కటుంబం కావడంతో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పాలెం రవి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బై రిపోర్టర్: గొల్లపెల్లి శ్రీకాంత్

