పైపులైన్ వేలంపై కలెక్టర్కు ఫిర్యాదు
గ్రామస్తుల సమక్షంలో పైపులైన్ వాడకంపై నిషేధం.. ఏకగ్రీవ తీర్మానం
జైపూర్, జూలై 25 ,ప్రజావాణి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ పైపులైన్ వేలం వివాదంపై శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.గ్రామంలో తాగునీటి సరఫరా కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైనును స్థానిక సర్పంచ్ అక్రమంగా వేలం వేశారంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన అదనపు కలెక్టర్ శనివారం శివ్వారం గ్రామపంచాయతీని సందర్శించారు. అనంతరం అధికారులతో కలిసి గోదావరి ఒడ్డున ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు , గ్రామ ప్రజల సమక్షంలో అదనపు కలెక్టర్ సుదీర్ఘ విచారణ జరిపారు. వివాదాస్పదంగా మారిన ఈ పైపులైనును ఇకపై ఎవరూ కూడా ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు.. భవిష్యత్తులో ఈ పైపులైన్ను ఎవరూ వాడటానికి వీల్లేదని గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆమోదించి, తీర్మానం చేశారు.
ఈ విచారణా కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు, మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్, డీఈఈ కిరణ్, జైపూర్ ఎంపీడీవో జి.సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపు రావు, మిషన్ భగీరథ ఏఈ ఎన్. రాజమల్లయ్య, గ్రామ సర్పంచ్ అంజన్ గౌడ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సృజన, గ్రామ పెద్దలు ,జైపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చల్లా విశ్వంబర్ రెడ్డి , పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



