ఘట్కేసర్, జూలై 22 : ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో త్వరలో నిర్వహించనున్న బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఘట్కేసర్ 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్భంగా బొక్క ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. పండుగ రోజుల్లో ఆలయాల వద్ద విద్యుత్ వెలుగులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య నిర్వహణ, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోళ్ల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, మీసాల సుధాకర్ రావు, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, డీసీసీ మాజీ కార్యదర్శి వి. ఆంజనేయులు యాదవ్, మాజీ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.




