రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ ధర్నా
గోదావరిఖని: రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ఎదుట రాజీవ్ రహదారిపై ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, ప్రతిపక్ష నాయకుడి అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ అధ్యక్షుడు, గ్రంథాలయ చైర్మన్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు పాల్గొన్నారు.




